Himachal Bus Accident: హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో శనివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడి, దిగువన ఉన్న రోడ్డుపై పడిపోయింది.
ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్తో సహా ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చంబా జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు ఘటనకు సంబంధించిన వివరాలను అధికారికంగా ధ్రువీకరించారు.
Read Also :Vijayawada news: కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య.. అసలు ఏం జరిగింది?

ప్రమాదం జరిగిన తీరు
బైరాగఢ్-తిస్సా రోడ్డులోని దేవికోఠి పరిధిలో ఉన్న చాలుంజ్ మోడ్ (Chalunj Mor) వద్ద ఈ ప్రమాదం జరిగింది. 'శర్మ బస్ సర్వీస్'కు చెందిన ఈ ప్రైవేట్ బస్సు ఉదయం 6:30 గంటలకు బైరాగఢ్ నుంచి చంబా వైపు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభించిన 3 కిలోమీటర్ల వ్యవధిలోనే కొండమలుపు వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు పైనుంచి కింద ఉన్న మరో రోడ్డుపై పడటంతో పలువురు ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
Himachal Bus Accident: సహాయక చర్యలు & విచారణ
ఆర్తనాదాలు విన్న వెంటనే స్థానిక గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), పోలీసులు, హోమ్గార్డులు, ఫైర్ సర్వీసెస్ మరియు రెవెన్యూ శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బస్సు శిథిలాల నుంచి బాధితులను వెలికితీశారు. గాయపడిన 10 మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చంబాలోని పండిట్ జవాహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన బైరాగఢ్-తిస్సా రహదారి ఇరుకైన కొండ మలుపులు, తీవ్రమైన లోయలతో కూడుకుని ఉంటుంది. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ORR వద్ద బ్రిడ్జి పిల్లర్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

