Gujarat Police Arrests Jaish e Mohammed : పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను గుజరాత్ ఉగ్రవాద నిరోధక శ్రేణి (ATS) అధికారులు పటన్ జిల్లా సిద్ధ్పూర్ తాలూకా ఖడియాల్ గ్రామంలో అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిని బిలాల్ అబిద్భాయ్ షేరా, మహ్మద్ అయూబ్ కడివాలా, మహ్మద్ పాలన్పురి, షఫియా రాయిస్ ముక్తి, మహ్మద్ హసన్ కర్దియాగా గుర్తించారు. నిందితులను మెహసానా జిల్లా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్.ఎం భాటియా ముందు హాజరుపరచగా, కోర్టు వారికి జులై 24 వరకు ఏటీఎస్ కస్టడీ విధించింది. జులై 3న గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఎనిమిది మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా ఈ ఐదుగురి పేర్లు బయటకొచ్చాయి. నిందితుల్లో ఒకరు క్రూడ్ టైమ్ బాంబును తయారు చేసి, దాన్ని పరీక్షించేందుకు విఫలయత్నం చేసినట్లు అధికారులు కోర్టుకు తెలిపారు. ముందుగా అరెస్టైన ఎనిమిది మందిలో ఒకరైన ‘అమీన్’ అనే వ్యక్తి ఈ ముఠాకు బాంబు తయారీ సామగ్రిని అందించినట్లు గుర్తించారు.
Gujarat Police Arrests Jaish e Mohammed
Gujarat Police Arrests Jaish e Mohammed : ఉపా (UAPA) చట్టం కింద కేసులు
రాష్ట్రంలో జైషే మహ్మద్ ఉగ్ర కార్యకలాపాలను విస్తరిస్తూ, క్రియాశీల నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు ఈ ముఠా ప్రయత్నిస్తోంది. నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA)లోని సెక్షన్లు 13, 17, 18, 38, 39తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 148, 61 కింద కేసులు నమోదు చేశారు. బాంబు తయారీ సామగ్రి, ఉర్దూ భాషలో ఉన్న జైషే మహ్మద్ ప్రచార సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకోవడానికి మరియు ఈ సామగ్రిని ఎక్కడి నుండి సేకరించారనే కోణంలో ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. జులై 3న గుజరాత్కు చెందిన ఏడుగురు, మధ్యప్రదేశ్కు చెందిన ఒకరితో కలిపి మొత్తం ఎనిమిది మంది (అహ్మద్, ఇబ్రహీం, ముదస్సిర్, జకారియా దురానీ, ముఫ్తీ ఫౌజాన్, మహమ్మద్ అమీన్ షేరా, మహమ్మద్ అబ్దుల్, బిలాల్ మహమ్మద్) ఉగ్రవాదులను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. అహ్మదాబాద్ను కేంద్రంగా చేసుకుని గుజరాత్తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ఉగ్ర నెట్వర్క్ను విస్తరించేందుకు వీరు ప్లాన్ చేశారు. వీరి మొబైల్ ఫోన్లలో వందల సంఖ్యలో డిజిటల్ ఫైళ్లను అధికారులు గుర్తించారు. ఆ అరెస్టుల కొనసాగింపు దర్యాప్తులోనే తాజాగా పటన్ జిల్లాలో మరో ఐదుగురు ఉగ్రవాదులు చిక్కారు.
Epaper: epaper.vaartha.com

