Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్​ మెట్రో రెండో దశపై మరో రెండు నెలల్లో కేంద్రం క్యాబినెట్​ ముందుకు

హైదరాబాద్​ మెట్రో రెండో దశపై మరో రెండు నెలల్లో కేంద్రం క్యాబినెట్​ ముందుకు

వార్త 1 week ago

Metro Phase 2 Proposal : హైదరాబాద్‌ నగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన మెట్రో రైలు రెండో దశ (Phase 2) ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియలో కీలక పురోగతి లభించింది.

ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు మరో రెండు నెలల్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం ముందుకు రానున్నాయి. అయితే, రెండో దశ అనుమతులు లభించాలంటే ఈలోగా మొదటి దశ (Phase 1) స్వాధీన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) ఎండీ పాల్గొన్నారు. ఫస్ట్ ఫేజ్ స్వాధీనంలో జరుగుతున్న ఆలస్యం, ఫేజ్-2 అనుమతుల్లో జాప్యం వల్ల పడుతున్న ఆర్థిక భారం మరియు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను రాష్ట్ర అధికారులు కేంద్రానికి వివరించారు. ఈ రెండు దశలను ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేస్తూ, రెండో దశ పూర్తయ్యే నాటికి మొదటి దశతో పూర్తి అనుసంధానం ప్రాసెస్ పూర్తి చేస్తామని అధికారులు లేఖ ద్వారా హామీ ఇచ్చారు.

Read Also: Delhi Lakshmi Yojana:మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సాయం.. ఆగస్టు 1 నుంచే దరఖాస్తులు!

 Metro Phase 2 Proposal

నెలన్నరకు పైగా సాగుతున్న ఎదురుచూపులు

మెట్రో మొదటి దశ స్వాధీన ప్రక్రియ నిజానికి మే నెల ఆఖరు నాటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ రుణ మంజూరు ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఎల్‌అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్‌కు రూ.13,527 కోట్ల రుణం ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ఒప్పందం చేసుకుంది. అయితే, కేంద్రం నుంచి ఎన్వోసీ (NOC) రాకపోవడంతో ఆ రుణం విడుదల కాలేదు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపి లేఖలు రాయడంతో పాటు స్వయంగా వెళ్లి కలిశారు. అనంతరం మొదటి దశ పునర్‌మదింపు (Revaluation) తో పాటు రుణ సేకరణ కోసం ఎస్బీఐ క్యాప్స్ (SBI Caps) ను కన్సల్టెంట్‌గా నియమించాలని ఉమ్మడిగా నిర్ణయించారు. గత నెలన్నర రోజులుగా అధికారులు జరిపిన నిరంతర సంప్రదింపుల ఫలితంగా రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లభించింది.

Metro Phase 2 Proposal : రుణ సమీకరణే ప్రస్తుతం అత్యంత కీలకం

మొదటి దశ ప్రక్రియ రెండు నెలల్లో పూర్తికావాలంటే నిధుల సమీకరణే ప్రధాన సవాలుగా మారింది. ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) ఒప్పందం నుంచి తప్పుకున్నట్లేనని కేంద్రం సంకేతాలు ఇవ్వడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వస్తోంది. జైకా (JICA) నుంచి కొంత భాగం జపాన్ యెన్లలో, మిగిలిన మొత్తం రూపాయల్లో రుణం పొందేలా మునుపటి షరతులతోనే ఎస్బీఐ (SBI), ఐసీఐసీఐ (ICICI) తో పాటు మరిన్ని ప్రముఖ బ్యాంకుల నుంచి రుణ సమీకరణకు మార్గాలు అన్వేషించాలని కేంద్రం సూచించింది.ఈ రుణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఏజెన్సీని ఎంపిక చేసే ఆలోచనలో హైదరాబాద్ మెట్రో రైలు ఉంది. అయితే గతంలో ఐఆర్‌ఎఫ్‌సీతో ఒప్పందానికే ఆరు నెలలకు పైగా సమయం పట్టినందున, ఈ ప్రక్రియ మొత్తం రెండు నెలల్లో పూర్తవుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మంగళవారం జరగాల్సిన మెట్రో బోర్డు సమావేశం కూడా వివిధ కారణాలతో వాయిదా పడింది. ఫేజ్-1లో ఎల్‌అండ్ టీ వాటాను 100% కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తి యాజమాన్య హక్కులు పొందుతుంది. కాగా, ఫేజ్-2ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుగా ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రోలు ఒకే యాజమాన్యం కింద నడుస్తున్నందున, హైదరాబాద్ మెట్రో రెండు దశలు కూడా ఒకే నిర్వహణ పరిధిలో ఉండాలని కేంద్రం కోరుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

కేంద్రానికి CJP హెచ్చరిక.. కేసులు ఎత్తి వేయకపోతే మళ్లీ ఉద్యమిస్తాం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha