Hyderabad Drinking Water Supply: రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్-సికిందరాబాద్ జంటనగరాలకు రాబోయే రోజుల్లో తాగునీటి గండం ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ప్రతిష్టాత్మక సింగూరు ప్రాజెక్టు ఆనకట్ట (Singur Dam) మరమతుల నేపథ్యంలో జలాశయంలోని నిల్వ నీటిని మూడు నెలల క్రితమే దిగువన ఉన్న మంజీర జలాశయం, ఘనపురం ఆనకట్టలకు పూర్తి స్థాయిలో వదిలిపెట్టారు.
ప్రాజెక్టు ప్రధాన గేట్లకు, గోడలకు మరమతు పనులు సాగాలంటే జలాశయంలో నీటి మట్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించక తప్పదని రాష్ట్ర డ్యాం సేఫ్టీ (Dam Safety) అధికారుల బృందం స్పష్టమైన సూచనలు చేయడంతో, జలవనరుల శాఖ ఆ మేరకు నీటిని దిగువకు విడుదల చేసింది. దీనివల్ల ప్రస్తుతం సింగూరు జలాశయం దాదాపు డెడ్స్టోరేజీ (Dead Storage) మట్టానికి చేరుకుంది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో కేవలం 5.374 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండటం గమనార్హం.
Read also: Meenakshi natarajan: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దుకు దారితీసిన ఆ కేసు ఏమిటి?
గ్రావిటీ ద్వారా నిలిచిపోనున్న జలాల సరఫరా..
జంటనగరాల తాగునీటి అవసరాల కోసం అనునిత్యం సంగారెడ్డి సమీపంలోని కలబూర్ వద్ద నిర్మించిన మంజీర రిజర్వాయర్ నుండి ఫేజ్-1, ఫేజ్-2ల ద్వారా.. అలాగే సింగూరు ప్రాజెక్టు హెడ్ వర్క్స్ వద్ద నుండి ఫేజ్-3, ఫేజ్-4ల ద్వారా మంజీర జలాలు నిరంతరాయంగా సరఫరా అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఫేజ్-3, ఫేజ్-4లకు సంబంధించిన ఇన్-టేక్ వెల్ పైప్లైన్లకు గ్రావిటీ (సహజ ప్రవాహం) ద్వారా నీరు అందే పరిస్థితి పూర్తిగా తగ్గిపోతుంది.

దీనికి తోడుగా ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తీవ్రమైన ‘ఎల్ నినో’ (El Nino) ప్రభావం వల్ల రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో వర్షాలు ఆలస్యమైతే హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
Hyderabad Drinking Water Supply: ప్రత్యామ్నాయాలపై వాటర్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు
కఠినమైన వేసవికాలాన్ని ఎలాగోలా అధిగమించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) అధికారులు, ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకునేందుకు ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గినప్పటికీ జంటనగరాలకు నీటి సరఫరాలో కోత పడకుండా ఉండేందుకు ఇన్-టేక్ బావుల వద్ద జలాల పంపింగ్కు ప్రత్యేక అత్యవసర ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందుకోసం జలాశయం లోపలి భాగాల నుండి భారీ మోటార్లను, విద్యుత్ సబ్స్టేషన్ లైన్లను అమర్చి, కృత్రిమంగా నీటిని తోడి పైప్లైన్లకు మళ్లించే పనులను వాటర్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ప్రస్తుతం ఈ పంపింగ్ వ్యవస్థకు సంబంధించిన పనులు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాలు పడి ప్రాజెక్టులోకి కొత్త వరద నీరు వచ్చేంతవరకు ఈ ప్రత్యామ్నాయ పంపింగ్ విధానం ద్వారానే నగర ప్రజల తాగునీటి దాహాన్ని తీర్చనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

