Pawan Kalyan: హైదరాబాద్లో జనసేన పార్టీ రేపు (జూన్ 2) నిర్వహించ తలపెట్టిన కీలక సమావేశానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో 'జనసేన సాధక్' (క్రియాశీల సభ్యులు) పేరుతో ఈ నవనిర్మాణ సభను నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేసుకుంది.
దాదాపు 2,000 మంది వరకు పార్టీ శ్రేణులు హాజరవుతారని భావించిన ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వడం లేదని సెరిలింగంపల్లి జోన్ డీసీపీ కార్యాలయం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది.
Janasena Sadhak Meeting
ఉద్రిక్త పరిస్థితులు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ భద్రతా ముప్పు!
ప్రస్తుతం నెలకొన్న శాంతిభద్రతల సమస్యలు, ప్రాంతీయ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తమ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఇటీవల ప్రొఫెసర్ కె. నాగేశ్వర్పై ఆంధ్రప్రదేశ్లో నమోదైన క్రిమినల్ కేసులు, తదనంతర పరిణామాల్లో ఏపీకి చెందిన జనసేన సహా కొందరు రాజకీయ నేతల వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచాయని పోలీసులు పేర్కొన్నారు. దీనివల్ల ఇక్కడి విద్యార్థి సంఘాలు, వివిధ శ్రేణుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయని, వాతావరణం వేడెక్కిందని తెలిపారు. దీనికి తోడు, జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో.. ఇలాంటి ఉద్వేగభరిత సమయంలో సభ నిర్వహణ సరికాదని, దీనివల్ల ఘర్షణలు జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.
Pawan Kalyan: పార్కింగ్ స్థలంపై క్రిమినల్ కేసులు.. పోలీసుల విచారణలో కీలక అంశాలు
సభా వేదికగా ఎంచుకున్న సంధ్యా కన్వెన్షన్ వద్ద సరిపడా పార్కింగ్ వసతి లేదని పోలీసుల అంతర్గత విచారణలో తేలింది. నిర్వాహకులు పార్కింగ్ కోసం చూపించిన ఎఫ్సీఐ సొసైటీ లేఅవుట్ స్థలానికి సంబంధించి తీవ్రమైన చట్టపరమైన వివాదాలు ఉన్నాయని, ఆ స్థలంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయని డీసీపీ తమ ఉత్తర్వుల్లో వెల్లడించారు. ప్రజా రక్షణ, శాంతి సామరస్యాలను కాపాడే ఉద్దేశంతోనే ఈ సభకు అనుమతిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ సమావేశ నిర్వహణ కోసం మే 29న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పోలీసులకు దరఖాస్తు సమర్పించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

