Indian Sailor Suspicious Death: విదేశంలో ఉద్యోగం చేస్తూ మరణించిన తమ కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ కుటుంబం కకావికలమైంది. దేహంలో కీలకమైన అంతర్గత అవయవాలు ఏవీ లేకుండా, కేవలం ఖాళీ శవాన్ని అప్పగించడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఉత్తరప్రదేశ్లోని దేవరియా జిల్లాకు చెందిన రాకేశ్ చౌహాన్ (33) అనే భారతీయ నావికుడి విషయంలో జరిగిన ఈ అమానవీయ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ దారుణంపై సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
Vital organs missing from son’s body… What happened in Venezuela?
Indian Sailor Suspicious Death: గుండెపోటు అన్నారు.. నెల రోజుల తర్వాత వచ్చిన శవం
వివరాల్లోకి వెళితే.. దేవరియా జిల్లా లగ్డా బజార్ టోలాకు చెందిన రాకేశ్ చౌహాన్, వెనెజువెలా దేశంలో ‘ఎక్స్ఫినిటీ’ అనే కంపెనీకి చెందిన మర్చంట్ నౌకలో నావికుడిగా పనిచేస్తున్నాడు. అయితే, ఈ ఏడాది మే నెలలో ఓడలో కిందపడి గాయపడ్డాడని, ఆ తర్వాత గుండెపోటుతో మరణించాడని షిప్పింగ్ కంపెనీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దాదాపు నెల రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జూన్ 4న రాకేశ్ మృతదేహం స్వగ్రామానికి చేరింది. అయితే, మృతదేహం అంతటా విపరీతంగా ఉన్న కుట్లను చూసి కుటుంబ సభ్యులకు తీవ్ర అనుమానం వచ్చింది.
పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు.. అవయవాలన్నీ ఖాళీ!
కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలతో దేవరియాలోనే మృతదేహానికి తిరిగి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదికలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. రాకేశ్ శరీరం నుంచి మెదడు, గుండె, రెండు ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, ప్లీహం, క్లోమం, కడుపు, ప్రేగులతో పాటు దాదాపు అన్ని ప్రధాన అంతర్గత అవయవాలను తొలగించినట్లు వైద్యులు నిర్ధారించారు.
శరీరంపై మెడ నుంచి కింది వరకు 22 కుట్లు, ఒక చెవి నుంచి మరో చెవి వరకు 21 కుట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. దేహంలో అసలు కీలక అవయవాలే లేకపోవడంతో, రాకేశ్ మరణానికి గల కచ్చితమైన కారణాన్ని (Cause of Death) తాము నిర్ధారించలేకపోతున్నామని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఇది ఆర్గాన్ మాఫియా (అవయవాల స్మగ్లింగ్) పనేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రంగంలోకి సీఫేరర్స్ యూనియన్.. రాయబార కార్యాలయం జోక్యంపై డిమాండ్
ఈ ఘోరమైన ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా (FSUI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో భారతీయ నావికులు బలిపశువులు అవుతున్నారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. వెనెజువెలాలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే రంగంలోకి దిగి, అక్కడ జరిగిన పూర్తి ఆటోప్సీ నివేదికను తెప్పించాలని డిమాండ్ చేసింది. రాకేశ్ మరణం వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసి, బాధిత కుటుంబానికి న్యాయం, భారీ నష్టపరిహారం ఇప్పించాలని ఎఫ్ఎస్యూఐ కోరింది. మమ్మల్ని పూర్తిగా చీకట్లో ఉంచారు. నా కొడుకు మరణానికి కారణమైన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని రాకేశ్ తండ్రి రామ్ దేవ్ చౌహాన్ కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఈ దారుణమైన ఆరోపణలపై వెనెజువెలా అధికారులు గానీ, సదరు షిప్పింగ్ కంపెనీ గానీ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.
read also:
నోయిడాలో దారుణం: పెళ్లయిన మరుసటి రోజు నుంచే భార్యపై భర్త దాడి

