Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మామిడి రైతు కన్నీటి పర్యంతం.. రాలిన మామిడికి దక్కని గిట్టుబాటు ధర

మామిడి రైతు కన్నీటి పర్యంతం.. రాలిన మామిడికి దక్కని గిట్టుబాటు ధర

వార్త 2 weeks ago

Chittoor: చిత్తూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం ప్రకృతి విలయ తాండవం చేయడంతో మామిడి రైతు కన్నీటి పర్యంతం అయ్యాడు. మరో పదిహేను రోజుల్లో మామిడి సీజన్ ప్రారంభం కానుండటంతో మామిడి తోటలో సాగు అయిన మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశించి గత మూడు నెలలుగా రైతు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మామిడి పంట మంగళవారం ఒక్కసారిగా ప్రకృతి ప్రకోపించడం తో పెద్ద ఎత్తున నేలపాలైంది.

ఈ సీజన్లో సాగు అయిన మామిడి పంటలో సుమారు 30 శాతం పంట మంగళవారం ఒక్కరోజే వీచిన పెను గాలులకు నేలమట్టం అయ్యింది. మామిడి తోటల్లో చెట్ల కింద బుధవారం తెల్లవారుజాము వెళ్ళి చూసిన రైతులకు భారీగా మామిడి కాయలు నేలపై పడి కన్పించాయి.

Read also: Veligonda Project: రాత్రంతా సొరంగంలోనే మంత్రి నిమ్మల.. వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలన

 Mangoes fallen on ground due to storm

Chittoor: అకాల గాలివాన మిగిల్చిన తీరని నష్టం

మరో పదిహేను రోజులు పంటను కాపాడుకుని వుంటే ఎదో ఒక గిట్టుబాటు ధర లభించి వుంటుందని భావించిన రైతులు పెను గాలులకు నేలమట్టం అయిన మామిడి కాయలను ఏరిపించడానికి కూలీలను పెట్టి అక్కడి నుండి ట్రాక్టర్లలో వేసుకుని తమ పరిధిలోని మార్కెట్ యార్డులకు వెళితే అక్కడ వ్యాపారులు మామిడి రైతులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఒక కేజీ మామిడి రూ.2కు కొనుగోలు చేస్తామని, అది సైతం మంచి కాయలను గ్రేడింగ్ చేసి కొనుగోలు చేస్తామని, మిగిలిన మామిడి కాయలు ఒక కేజీ రూ.1కు కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులకు దిమ్మతిరిగింది.

కష్టానికి దక్కని గిట్టుబాటు ధర

వీచిన పెను గాలులకు నేలమట్టం అయిన మామిడి కాయలను తోటల్లో అలాగే వదలి వేసి వుంటే తమకు ఎలాంటి నష్టం వుండేది కాదని, కూలీలను పెట్టించి తోటల్లో కాయలను ఏరిపించి అక్కడి నుండి ట్రాక్టర్ బాడుగకు తీసుకుని మార్కెట్ కమిటీకి రావడంతో మామిడి కాయలు విక్రయిస్తే వచ్చే డబ్బు కన్నా తమ జేబుల నుండి డబ్బులు పోతుండటంతో రైతుకు తలబొప్పి కట్టింది. జిల్లాలో మంగళవారం తవణంపల్లి, ఐరాల, యాదమరి, బంగారుపాళ్యం, వి.కోట, పలమ నేరు, పూతలపట్టు, పెనుమూరు, కార్వేటి నగరం, జిడినెల్లూరు మండలాల పరిధిలో భారీగా పెనుగాలులు వీచాయి.

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల డిమాండ్

ఈ పెనుగాలుల తో వందలాది ఎకరాల్లో మామిడి తోటల్లో మామిడి కాయలు నేలమట్టం అయ్యాయి. మామిడి పంటపై భారీ ఆశలు పెట్టుకున్న మామిడి రైతులకు పెట్టిన పెట్టుబడి సైతం తిరిగి రాని పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా వుంది. ప్రభుత్వం సత్వరం ఎన్యుమరేషన్ నిర్వహించి మామిడి రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. అలాగే గాలి వానకు నేల రాలిన మామిడి కాయలకు ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాల్సి వుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha