Southwest Monsoons: దేశవ్యాప్తంగా సాగు సాగుతున్న రైతాంగంతో పాటు సాధారణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమవుతోంది.
సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1వ తేదీ కల్లా కేరళ తీరాన్ని తాకాల్సిన ఈ రుతుపవనాలు, ఈసారి కాస్త ఆలస్యంగా కదలనున్నాయి. అయితే, రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి దేశంలోకి ప్రవేశించడానికి వాతావరణం అనుకూలించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) మంగళవారం వెల్లడించింది. దీని ప్రకారం.. జూన్ 4 లేదా 5వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకే వీలుందని అంచనా వేస్తున్నారు.
IMD Rain Forecast
read also: Annamalai : 'ఫేర్వెల్ మీటింగ్' కోసం ఢిల్లీకి అన్నామలై?
రుతుపవనాలు మందగించడానికి కారణాలు ఏమిటి?
ప్రారంభంలో మే 26 నాటికే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ భావించినప్పటికీ, వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుల వల్ల ఆ అంచనా తప్పింది.
పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల్లోని గాలుల వేగం మందగించడం, బంగాళాఖాతంలో ఏర్పడిన కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాల ప్రయాణం నెమ్మదించింది. రుతుపవనాల రాకను అధికారికంగా ప్రకటించాలంటే కేరళలోని 60 శాతం వాతావరణ కేంద్రాలలో వరుసగా రెండు రోజుల పాటు కనీసం 2.5 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావాలి. దాంతో పాటు గాలుల వేగం, దిశ కూడా అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం ఈ ప్రమాణాలు ఇంకా పూర్తిస్థాయిలో నమోదు కాలేదు.
Southwest Monsoons: తక్కువ వర్షపాతం అంచనా: అన్నదాతల్లో ఆందోళన
ఈ ఏడాది దేశంలో వర్షాలు సాధారణం కంటే తక్కువగానే కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో కేవలం 90 శాతం మాత్రమే నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఇప్పటికే హెచ్చరించింది. ఈ పరిణామం వర్షాధార పంటలపై ఆధారపడే రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉత్తర, మధ్య భారత దేశాల్లో ఎండల తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. కేరళలో ప్రవేశించిన తర్వాతే ఇవి దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు విస్తరించనున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

