Kalyandurg Municipality Scam: కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో భారీ స్థాయిలో ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ నిధుల దుర్వినియోగం, అక్రమ బదిలీలకు సంబంధించిన వ్యవహారంపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ ఫిర్యాదుతో స్థానికంగా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Andhra Pradesh: మంత్రి లోకేశ్తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ
విశ్వసనీయ సమాచారం మేరకు, గత పాలకవర్గం కాలంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్కుమార్ హయాంలో మున్సిపల్ నిధులను(Kalyandurg Municipality Scam) ప్రైవేట్ బ్యాంకులకు మళ్లించి ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. సుమారు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు నిధుల లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు ప్రాథమిక స్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే స్వయంగా ఫిర్యాదు చేయడంతో మున్సిపాలిటీలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. దర్యాప్తు అనంతరం నిజానిజాలు బయటపడనున్నాయి.

