Narmeta Oil Palm Factory; సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను, అపోహలను ప్రజలెవరూ నమ్మవద్దని ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి కోరారు.
మంగళవారం ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో గత 30 సంవత్సరాలుగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో మూడు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు విజయవంతంగా నడుస్తున్నాయని, అవన్నీ గ్రామాలకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ స్థానిక ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
Read also: Ponnam Prabhakar: పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని అత్యంత అధునాతనమైన, పర్యావరణహిత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్లు మేనేజర్ వివరించారు. ఫ్యాక్టరీలో వంద శాతం ఆర్గానిక్ స్వభావం కలిగిన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే ప్రాసెస్ చేస్తామని, ఆ గెలలు కొంత సమయం పాటు నిల్వ ఉండటం వల్ల సహజంగా జరిగే బ్యాక్టీరియా చర్యల వల్ల ఒక రకమైన ప్రత్యేక వాసన గాలిలో వ్యాపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ వాసన పూర్తిగా సహజసిద్ధమైన పండ్ల గుజ్జు నుండి ఉత్పన్నమయ్యే ఆర్గానిక్ వాసన మాత్రమేనని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ రకమైన ప్రాసెసింగ్ ప్రక్రియలో ఎలాంటి హానికరమైన రసాయనాలు గానీ, ప్రమాదకరమైన గ్యాస్లను గానీ ఉపయోగించరని ఆయన వెల్లడించారు.
ఫ్యాక్టరీ యాజమాన్యం(Narmeta Oil Palm Factory) ఎల్లవేళలా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు మరియు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తుందని శ్రీకాంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సమీప గ్రామాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఫ్యాక్టరీ ఇంచార్జ్ ప్రాణేశ్ గౌడ్, ఆయిల్ పామ్ ఇంజనీర్ గోపాలకృష్ణ మరియు ఇతర ఫ్యాక్టరీ అధికారులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

