EPF Interest: దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసే ప్రక్రియను బుధవారం (జూలై 15) అధికారికంగా ప్రారంభించింది.
ఈ సారి ఏకంగా రికార్డు స్థాయిలో 8.25 శాతం భారీ వడ్డీ రేటును సభ్యుల అకౌంట్లలో జమ చేస్తుండటంతో పీఎఫ్ ఖాతాదారులకు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ఠ లాభం చేకూరనుంది. మీ పీఎఫ్ ఖాతాలోకి వడ్డీ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్వో పలు సులువైన డిజిటల్ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.
Read Also :IBM Share Price Crash: ఒకే రోజులో 25% కుప్పకూలిన షేర్లు, రూ. 6 లక్షల కోట్లు ఆవిరి!
వడ్డీ సొమ్మును ఆన్లైన్లో చెక్ చేసుకోండిలా

- అధికారిక వెబ్సైట్ ద్వారా: మొదట ఈపీఎఫ్వో (EPFO) అఫీషియల్ పోర్టల్ను సందర్శించాలి. అక్కడ మీ యాక్టివ్ యూఏఎన్ (UAN) నంబర్, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. అనంతరం ‘మెంబర్ పాస్బుక్’ (Member Passbook) సెక్షన్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకుంటే, క్రెడిట్ అయిన తాజా వడ్డీ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.
- ఉమాంగ్ యాప్ (Umang App): స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉమాంగ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా లాగిన్ అయి క్షణాల వ్యవధిలో తమ పీఎఫ్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ను వీక్షించవచ్చు.
EPF Interest: ఇంటర్నెట్ లేకుండానే మొబైల్లో బ్యాలెన్స్ వివరాలు
స్మార్ట్ఫోన్ లేదా ఇంటర్నెట్ సదుపాయం లేని సాధారణ మొబైల్ యూజర్లు సైతం తమ పీఎఫ్ ఖాతా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాకు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఈపీఎఫ్వో కేటాయించిన ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. వెంటనే ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ మొబైల్కు వస్తుంది. నిర్దేశిత ఫార్మాట్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా వడ్డీ జమతో కూడిన పూర్తి స్టేట్మెంట్ను నేరుగా మీ మొబైల్ స్క్రీన్పైనే పొందవచ్చు.

