Telangana Politics:ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే నవ నిర్మాణ సభలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తిననని చెప్పిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ రాష్ట్రంలో సభలు నిర్వహించడం ఆక్షేపణీయమన్నారు. తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని గతంలో చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి చేసే విధంగా మాట్లాడిన నాయకుడిని ప్రజలు ప్రశ్నిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్తో తెలంగాణకు సోదర సంబంధాలు ఉన్నాయని, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ప్రేమాభిమానాలు కొనసాగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. అయితే తెలంగాణపై విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను సహించబోమన్నారు.
Telangana Politics:గత వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలి
నవ నిర్మాణ సభలు నిర్వహించాలంటే ముందుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పవన్ కళ్యాణ్కు సూచించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో కాకుండా తెలంగాణలోనే సభలు నిర్వహించడం వెనుక రాజకీయ ఆంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు పండుగరోజని పేర్కొన్న మంత్రి, ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునే వారందరికీ స్వాగతం ఉన్నప్పటికీ తెలంగాణను అవమానించే వ్యాఖ్యలు మాత్రం అంగీకరించబోమన్నారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో అమరులైన కుటుంబాలు, పోరాట యోధులను గుర్తించి గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు నిర్వహించవచ్చని, అయితే విద్వేష రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ అంశం కాదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

