Mancherial Crime: ప్రేమించాలంటూ ఒక ఉన్మాది చేసిన మానసిక వేధింపులు, బెదిరింపులు చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినా సదరు వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో..
ఆ వేధింపులను తట్టుకోలేక, తప్పించుకునే మార్గం లేక ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టేకుమట్ల గ్రామానికి చెందిన గోషిక బాలేష్, రాజేశ్వరి దంపతుల నాలుగో కుమార్తె మాధవి (26) బీ ఫార్మసీ పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన గోనె వెంకటేశ్ అనే సింగరేణి కార్మికుడు గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకోవాలంటూ ఆమె వెంటపడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కులాలు వేరు కావడంతో మాధవి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి నిరాకరించారు. దీంతో మరింత రెచ్చిపోయిన వెంకటేశ్.. రెండు రోజుల క్రితం నేరుగా పురుగుల మందు డబ్బాతో మాధవి ఇంటికి వెళ్లి రచ్చ చేశాడు.
Young woman commits suicide, unable to bear harassment.
Mancherial Crime: 'నేను చనిపోతే నీదే బాధ్యత' అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్
మాధవి ఎక్కడికి వెళ్లినా ఆటోలో వెంబడిస్తూ వేధించడం, ఆమె హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో బస్టాండ్లో అడ్డుకుని, “నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇక్కడే మందు తాగి చనిపోతా.. నా చావుకు కారణం నువ్వే అవుతావు” అంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో పంచాయితీ నిర్వహించి గట్టిగా హెచ్చరించినప్పటికీ అతని తీరు మారలేదు. కుమారుడిని మందలించాల్సిన వెంకటేశ్ తల్లి శంకరమ్మ, అక్క శైలజ కూడా అతడికే వత్తాసు పలుకుతూ..మా వాడికి ఏమైనా అయితే ఊరుకోబోం అంటూ మాధవి కుటుంబాన్ని రివర్స్లో హెచ్చరించారు.
సూసైడ్ నోట్ రాసి యువతి బలి
వెంకటేశ్ కుటుంబం నుంచి వస్తున్న మానసిక ఒత్తిడి, బెదిరింపులను తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన మాధవి.. నా చావుకు కారణం వెంకటేశ్ అని సూసైడ్ నోట్ రాసి ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రధాన నిందితుడు వెంకటేశ్తో పాటు అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లంచం తీసుకుంటూ దొరికిన పెద్దపల్లి ఏఈ.. సోదాల్లో రూ.32 లక్షలు సీజ్!

