Shankarpally Tragedy: క్షణికావేశం ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. కన్నబిడ్డలను బావిలోకి తోసేసిన ఒక తల్లి..
తానూ అదే బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ దారుణ ఘటనలో ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
అసలేం జరిగిందంటే..?

స్థానికులు, పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన సుధాకర్, వసంత (35) దంపతులు ఉపాధి నిమిత్తం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి 15 ఏళ్ల కుమార్తె, 10 ఏళ్ల కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య కుటుంబ పరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్తతో జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత, రాత్రి సమయంలో ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. నేరుగా ఊరి చివర ఉన్న ఒక వ్యవసాయ బావి వద్దకు చేరుకున్న ఆమె.. ముందుగా పిల్లలిద్దరినీ అందులోకి తోసేసింది. అనంతరం తానూ అదే బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Shankarpally Tragedy: చెట్టు కొమ్మ పట్టుకుని బతికిన బాలుడు
తల్లి బావిలో తోసేసిన సమయంలో పదేళ్ల కుమారుడు అదృష్టవశాత్తూ లోపల ఉన్న ఒక చెట్టు కొమ్మకు చిక్కుకున్నాడు. ఆ కొమ్మను గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉండిపోవడంతో అతడు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. వసంతతో పాటు 15 ఏళ్ల కుమార్తె బావిలో మునిగిపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

