Two-Year Trust Program | విజయనగరం, జూన్ 15: ప్రభాతవార్త :రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం" కార్యక్రమంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్ధిదారులు తమ జీవితాల్లో చోటుచేసుకున్న సానుకూల మార్పులను హృదయపూర్వకంగా వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా కొత్త ఆశలను నింపాయని వారు ఆనందం వ్యక్తం చేశారు.
Read Also: Chandrababu Naidu: సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
"గంజాయి బారిన పడిన మా కుటుంబాన్ని పోలీసులు కాపాడారు"
జామి మండలానికి చెందిన కె. వెంకటగోపాల్ మాట్లాడుతూ, తన బావ గంజాయి వ్యసనానికి గురవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు. ఈ పరిస్థితిని గుర్తించిన పోలీసు శాఖ ప్రత్యేక బృందం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడంతో తన బావ పూర్తిగా మారిపోయారని చెప్పారు.
"ఒకప్పుడు మా కుటుంబం భవిష్యత్తుపై ఆందోళన చెందేది. ఇప్పుడు మా బావ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. నా మేనల్లుడు కూడా చక్కగా చదువుకుంటున్నాడు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేస్తున్న కృషి అమూల్యమైనది" అంటూ ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
"సంక్షేమ పథకాలతో ఏటా రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాం"
శృంగవరపుకోట మండలానికి చెందిన శ్రీమతి చింతాడ భవాని మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు తమ కుటుంబ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేశాయని చెప్పారు.
"పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ ద్వారా సంవత్సరానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతోంది. మా కుటుంబంలోని వృద్ధులకు నెలకు రూ.4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తోంది. దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం లభిస్తున్నాయి. మహిళా సంఘం ద్వారా రుణం తీసుకుని పాల డెయిరీ ఏర్పాటు చేసుకున్నాం. చిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ ఆదాయం పెంచుకున్నాం. పిల్లలను బీటెక్ వరకు చదివించగలిగాం. అనారోగ్య సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందింది. గత 27 సంవత్సరాలుగా డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్న నేను నేడు ప్రభుత్వ సహకారంతో ఏటా రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాను" అని ఆనందం వ్యక్తం చేశారు.
Two-Year Trust Program: "ప్రభుత్వ పథకాలతో ఆర్థిక భరోసా లభించింది"
గంట్యాడ మండలం బోనంగి గ్రామానికి చెందిన శ్రీమతి జి. హేమలత మాట్లాడుతూ, పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల సహాయం అందుతోందని తెలిపారు.
"దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం లభిస్తున్నాయి. వివిధ సంక్షేమ పథకాల వల్ల కుటుంబ ఖర్చులు తగ్గి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నాం. ప్రభుత్వ సహకారం మా కుటుంబానికి పెద్ద అండగా నిలిచింది" అని పేర్కొన్నారు.
Two-Year Trust Program
“ఉపాధి హామీ - పేదల జీవితాల్లో భరోసా"
గంట్యాడ మండలం రామవరం గ్రామానికి చెందిన వర్రి మహేష్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా తమ కుటుంబానికి నిరంతర ఉపాధి లభిస్తోందని తెలిపారు.
"ఉపాధి హామీ పనుల ద్వారా ఆదాయం పొందుతున్నాం. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా వరప్రసాదం" అని అన్నారు.
"ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన సంక్షేమ పాలన"
కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల తమ జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని, ఆర్థిక భద్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొంటూ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న పాలన పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
read also:

