Tarun Tejpal: తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రముఖ 'తెహల్కా' (Tehelka) మ్యాగజైన్ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్పాల్ను (Tarun Tejpal) దోషిగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు గోవా బెంచ్ గురువారం (ఆగస్టు 6, 2026) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
మే 2021లో మాపుసా సెషన్స్ కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం (జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్సాండేకర్) కొట్టివేసింది. గోవా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను అనుమతించిన కోర్టు.. తేజ్పాల్పై మోపబడిన భారతీయ శిక్షా స్మృతి (IPC) సెక్షన్లు 376(2)(f), 376(2)(k) (అత్యాచారం), 354A, 354B (లైంగిక వేధింపులు) కింద ఆయన్ను దోషిగా (Guilty) ప్రకటించింది.
Read Also :UP : భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త
"నో అంటే నో చెప్పడమే".. హైకోర్టులో వాదనల ముఖ్యాంశాలు

- సిఐడి, సోలిసిటర్ జనరల్ వాదనలు:గోవా సిఐడి తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడ్వకేట్ జనరల్ దేవిదాస్ పంగమ్ వాదిస్తూ.. సెషన్స్ కోర్టు నిందితుడి నేరాన్ని పరిశీలించకుండా, బాధితురాలి ప్రవర్తనను, నేరం జరిగిన తర్వాత ఆమె ప్రతిస్పందనను విచారణకు గురిచేసిందని ఆరోపించారు. నిందితుడు బాధితురాలికి పంపిన 'క్షమాపణ ఈమెయిల్' వంటి కీలక ఆధారాలను విచారణ కోర్టు విస్మరించిందని పేర్కొన్నారు."ఒక యువతి 'నో' (కాదు/వద్దు) అని చెబితే దానికి అర్థం 'నో' అని చెప్పడమే అనే స్పష్టమైన సందేశాన్ని ఈ కోర్టు సమాజానికి ఇవ్వాలి" అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
- తేజ్పాల్ లాయర్ వాదన:తేజ్పాల్ తరఫు సీనియర్ అడ్వకేట్ ఆబాద్ పోండా వాదిస్తూ.. విచారణ కోర్టు సమగ్ర ఆధారాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ఆధారంగానే తీర్పు ఇచ్చిందని, నిందితుడిపై గత 13 ఏళ్లలో ఎలాంటి ఇతర కేసులు లేనందున, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనువుగా తీర్పుపై కనీసం 8 వారాల స్టే ఇవ్వాలని, శిక్ష విషయంలో సడలింపు చూపాలని కోరారు.
- కోర్టులో తేజ్పాల్ వ్యాఖ్యలు:కోర్టు ఆదేశాల మేరకు నేరుగా హాజరైన 62 ఏళ్ల తరుణ్ తేజ్పాల్ స్పందిస్తూ.. "నాకు 62 ఏళ్లు. నేనే ఒక బాధితుడిని. నాకు భార్య ఉంది. మేము ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తాము, దయచేసి నా పట్ల ఉదారత (Leniency) చూపించండి" అని వేడుకున్నారు.
Tarun Tejpal: 2013 నుంచి 2026 వరకు.. కేసులోని ప్రధాన ఘట్టాలు
ఘటన & ఫిర్యాదు
నవంబర్ 2013
గోవాలోని ఒక హోటల్ లిఫ్ట్లో తనపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిగిందని తేహల్కా జూనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ శోభా చౌదరికి ఫిర్యాదు చేశారు. తేజ్పాల్ బాధితురాలికి క్షమాపణ ఈమెయిల్ పంపారు. అనంతరం గోవా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి నవంబర్ 30న తేజ్పాల్ను అరెస్టు చేశారు.
జామీను మంజూరు
జూలై 2014
దాదాపు ఎనిమిది నెలల జైలు జీవితం తర్వాత సుప్రీంకోర్టు తేజ్పాల్కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
చార్జీల నమోదు
సెప్టెంబర్ 2017
మాపుసా సెషన్స్ కోర్టు తేజ్పాల్పై నిబంధనల ప్రకారం చార్జీలు నమోదు చేసింది. ప్రాసిక్యూషన్ 71 మంది సాక్షులను విచారించింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
ఆగస్టు 2019
చార్జీలను రద్దు చేయాలని తేజ్పాల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ.. ఈ నేరాన్ని "నైతికంగా అసహ్యకరమైనది" (Morally Abhorrent) గా అభివర్ణించింది.
సెషన్స్ కోర్టు నిర్దోషిత్వం
మే 2021
సాక్ష్యాధారాలు లేవనే సాకుతో మాపుసా సెషన్స్ కోర్టు తేజ్పాల్ను కేసు నుండి ఖలాస్ (Acquitted) చేసింది.
హైకోర్టు దోషిగా నిర్ధారణ
ఆగస్టు 6, 2026
బాంబే హైకోర్టు సెషన్స్ కోర్టు తీర్పును రద్దు చేసి, తరుణ్ తేజ్పాల్ను అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారించింది.

