Hyderabad Bullet Train : హైదరాబాద్ను దక్షిణాది బుల్లెట్ రైలు నెట్వర్క్కు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ‘కామన్ బుల్లెట్ రైల్ హబ్’ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతుండగా, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) ఇంకా అధికారికంగా రాకముందే అలైన్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం స్థానిక రైతులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా పుణెకు వెళ్లనున్న బుల్లెట్ రైలు మార్గానికి సంబంధించినవంటూ కొన్ని గూగుల్ ఎర్త్ మ్యాప్ ఫొటోలు సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతున్నాయి. వైరల్ అవుతున్న మ్యాప్ల ప్రకారం శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ, సయ్యద్గూడ, పెద్ద గోల్కొండ, నందిపల్లి, రషీద్గూడ మరియు మహేశ్వరం మండలంలోని మంఖాల్ గ్రామాల మీదుగా ఈ ట్రాక్ వెళ్తోంది. ఈ మార్గం సుమారు 60 మీటర్ల వెడల్పులో కనిపిస్తుండటంతో కనీసం 2,000 ఎకరాల భూసేకరణ జరగవచ్చని రైతులు భావిస్తున్నారు. గతంలోనే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) కోసం 40 శాతం భూములు కోల్పోయామని, ఇప్పుడు మళ్లీ భూసేకరణ జరిపితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని వాపోతున్నారు.
Hyderabad Bullet Train
Read Also: Bhadrachalam : భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
Hyderabad Bullet Train : నిపుణులు, రెవెన్యూ అధికారుల స్పందన
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలపై రవాణా రంగ నిపుణులు మరియు రెవెన్యూ అధికారులు క్లారిటీ ఇచ్చారు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ద్వారా కన్సల్టెంట్స్ గూగుల్ ఎర్త్ ఆధారంగా ప్రాథమిక గుర్తులు వేసి ఉంటారని నిపుణులు తెలిపారు. సాధారణంగా బుల్లెట్ రైలు ట్రాక్ వెడల్పు 17.5 మీటర్లు మాత్రమే ఉంటుంది. సర్వే ప్రారంభంలో మూడు రకాల అలైన్మెంట్లను చిత్రీకరించిన తర్వాతే తుది మార్గాన్ని ఖరారు చేస్తారని, కాబట్టి ఇప్పుడే ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు.రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన ఏడు హైస్పీడ్ కారిడార్లలో మూడు హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల గుండా మొత్తం 2,028 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టులో ఒక్క తెలంగాణలోనే 512 కిలోమీటర్ల హైస్పీడ్ ట్రాక్ ఏర్పాటు కానుంది.

